Ganesh Precaution

'పాటలు' ఓకే.. 'పోటీలతో' షాకే!












ప్రారంభం కానున్న లడ్డూ వేలం పాటలు









కొన్ని మండపాల వద్ద తినే పోటీలు సైతం


ప్రమాదహేతువు అంటున్న వైద్య నిపుణులు


ప్రసాదాలపై కన్నేసి ఉంచాలంటూ సూచనలు


గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో వినాయకుడికి నైవేధ్యంగా పెట్టిన లడ్డూల వేలం పాటతో పాటు ఎవరు ఎక్కువ లడ్డూలు తింటారనే పోటీలు కూడా అక్కడక్కడా జరుగుతుంటాయి. చివరి నాలుగైదు రోజులు ఈ పోటీలు జోరుగా జరుగుతాయి. లడ్డూ వేలం పాటల వరకు పర్వాలేదు కానీ... వాటిని తినే పోటీలు మాత్రం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని సరదా కోసం ఓ ఎఫ్‌ఎం రేడియో సంస్థ తార్నాకలో ఏర్పాటు చేసిన లడూŠుడ్ల తినే పోటీ జోషి అనే వ్యక్తి ప్రాణాలు తీసిందని గుర్తుచేస్తున్నారు. గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో కొందరు మండపాల నిర్వాహకులతో పాటు వివిధ ప్రైవేట్‌ సంస్థలూ ప్రచారం కోసం ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వివిధ ఆకృతులతో ఉన్న టోపీలు, టీ–షర్టులు పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా... లడ్డూలు తినే పోటీలు వంటివీ నిర్వహిస్తారు. పోటీలో పాల్గొని అందరికంటే ఎక్కువ లడ్డూలు తిన్న వారిని విజేతగా ప్రకటించి, బంగారు నాణాలు, నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తుంటారు. ఇలాంటి పోటీలు ప్రాణాలు తీస్తాయని, ఎవరికి వారు ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని స్పష్టం చేస్తున్నారు.  








కంగారులో ప్రాణాల మీదికి...
ఇలాంటి పోటీల్లో పాల్గొనే వారు విజేతలుగా నిలవాలనే ఉద్దేశంతో తక్కువ సమయంలో ఎక్కువ లడ్డూలు తినే ప్రయత్నం చేస్తారు. దీనికోసం లడ్డూను పూర్తిగా నమలకుండా మింగేయడంతో పాటు ఏమాత్రం విరామం లేకుండా ఒకదాని తర్వాత మరోటి తినాలని చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో లడ్డూలు గొంతులో ఇరుక్కుంటాయని, కొన్ని సందర్భాల్లో బాధితుడిని తక్షణం ఆస్పత్రికి తరలించినా... ఇరుక్కున్న వాటిని తొలగించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. అలాంటి సమయంలో కనీసం మంచినీళ్లు సైతం తాగలేని పరిస్థితులు ఉంటాయని పేర్కొంటున్నారు. చివరకు గొంతులో ఇరుక్కున్న లడ్డూ కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారి, బాధితుడు మృత్యు ఒడికి చేరే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.